పూర్వం ఒక రాజకన్య సూర్యభగవానుని ప్రేమించి అతడిని చేరుకోవాలనే కోరికతో, రోజూ అతడిని చూస్తూ ఆరాధనతో గడిపేదట. ఆకసం వైపే చూస్తూ సూర్యుడెటు తిరిగితే అటు తిరుగుతూ గడిపి క్రమంగా ఆ తావుననే పూలచెట్టుగా మారిపోయిందట.
అరవింద అతి ముగ్ద అయిన కన్య.
తల్లిదండ్రులూ సోదరులూ కనురెప్పగా కాచిపెంచిన సుకుమారి. దౌష్ట్యం అనుభవిస్తూ, కాలం పెట్టిన దారుణ పరీక్షలకు గురి అవుతూ, పల్లెత్తి పలుకక, మూగగా బాధ అనుభవించింది. ఆకసాన ఉన్న ఆదిత్యుడు ఒక్కసారైనా తనను కరుణించకపోతాడా అని ఆశతో నిరీక్షించి, నిరీక్షించి సూర్యముఖిలాగే నేలరాలిపోయింది.
స్త్రీ కొక న్యాయము, పురుషుడి కొక న్యాయమూ ఎందుకు రాశావని భగవంతుణ్ణి నిలదీసి అడిగేందుకు వెళ్లిపోయింది.
హృదయాలను కరిగించి, సానుభూతితో నింపే ఆర్ద్రమైన కథ, అలరించే కథనధోరణి, అత్యుత్తమ పాత్రచిత్రణతో కన్నీళ్లను దోచుకునే నిండైన నవల ”సూర్యముఖి.”