ప్రతిభ ఉన్నంత మాత్రాన ప్రజ్ఞావంతులు కాలేరు. ప్రతిభను రాణింప చేయగల దోహదకారులు కావాలి. ప్రమిదలో చమురుపోస్తాం. జ్యోతిని వెలిగించుతాం. కాని, ఆ జ్యోతిని కొడిగట్టకుండ ఎగద్రోయడానికి ఒక చిన్న సమిథ అవసరము.
ఆ చిన్ని సమిథ ప్రాముఖ్యత గుర్తించినది ఎందరు?
తన సేవను ఎవరూ గుర్తింపక నేలపాలయ్యే ఆ ‘అనామిక’కు కూడా ఒక మనసూ, తపన వుంటాయి.
కొందరు సేవలు అందుకోవటానికి జన్మిస్తారు. కొందరి జన్మలు కేవలం త్యాగం కోసమే. అనాదిగా వస్తూన్న ‘అనామిక’ కథకు పరిష్కారం లేకున్నా పరితాపం మాత్రం తప్పదు.
అలసిసొలసి ఇంటికి వచ్చిన పురుషునికి, కావలసిన స్త్రీ నిర్లక్ష్యం చేస్తే? నిరాశా తైలంలో మునిగి జీవనజ్యోతి ఆరేవేళ ఆమెను రక్షించి జ్యోతిని దేదీప్యమానంగా నిలిపిఉంచిన ఆమె ‘అనామిక’యే కావచ్చు కానీ చిరస్మరణీయ. ఈ నవల ఆంధ్రులు అభిమానించే రచయిత్రి శ్రీమతి ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి కలం నుంచి వెలువడినది.