సుశీల… సుశీల! ప్రతివాళ్లకూ, ఆఖరుకు పరాయివాళ్లకు కూడా సుశీల ప్రసక్తేనా? అని పళ్లు పటపటలాడించింది సుభద్ర.
ఆమె సామాన్య కుటుంబంలో, సమస్యలతో వేగే కుటుంబంలో పుట్టింది. ఎన్నో కలలు కన్నది. మెట్టింది సమస్యలులేని ఇల్లు అయినా ఆయన రెండో పెళ్లివాడు. పైగా పిల్లలు. సుభద్రకు కంటగింపుగా ఉండటంలో ఆశ్చర్యంలేదు. కసీ, ఉక్రోషమూ కలిగినా ఆశ్చర్యంలేదు.
ఆమె మనస్తాపం లోకంచూస్తేగాని తీరలేదు. తానొక్కతేకాదు. ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వారినిచూస్తే ఆమెకు తానెంతటి తప్పు చేస్తున్నదో, భర్తకూ, పిల్లలకూ ఎంత అన్యాయం చేస్తున్నదో తెలిసి వచ్చింది. పైగా పుట్టింటివారు తనను అడ్డంపెట్టుకుని తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవాలని ఆలోచించారు.
ఆమె చూసిన లీల, కుసుమ, కోమలి, కమలల జీవితాలు కనువిప్పు కలిగించాయి. రమదీ, తనదీ ఒకేరకమైన జీవితం! కాని తనకూ, ఆమెకు మధ్య ఎంత భేదం! జ్ఞానోదయం అయిన తర్వాత ఆమె మనసు సంతృప్తితో నిండిపోయింది. ఇల్లు స్వర్గంలా కనిపించింది.
పిల్లలను దగ్గరకు చేర్చుకుని ”తప్పు. నన్ను ‘పిన్నీ’ అనకూడదు. ‘అమ్మా’ అని పిలవాలి. నేనే అమ్మని మీకు” అని చెప్పింది. ఇక ఆ సంసారచక్రం ఒడుదుడుకులకు లోనవ్వదు!… చక్కని సంసారిక నవల.