‘తెర తొలిగింది’
”తల్లి వెచ్చని ఒడి ఎరుగను! పుట్టగానే దాయీలచేతిలో పడేసి ధనవంతు లందరిలాగా నీ చేతులు దులుపుకున్నావ్. కన్న హక్కుతప్ప పెంచిన మమకారం నీకు ఎక్కడినుంచి వస్తుంది? హడలిపోతూ ప్రాణాలు గుప్పిట్లో పట్టుకొని రోజులూ, సంవత్సరాలూ గడిపాను… నీకు ఎదురుచెప్పలేని అశక్తునిగా తయారుచేశావ్! రక్తమాంసాలున్న కీలుబొమ్మలా ఆడించావ్ కానీ, ఇక నాకు విముక్తి కావాలి!. వస్తాను!. నీకూ నాకు ఇంతటితో ఋణం తీరిపోయింది. మళ్ళీ ఈ జన్మలో ఈ ఇంటి గడపతొక్కను…” – విసురుగా లేచి వెళ్ళిపోయాడు సురమౌళి.
తల్లి వెచ్చని ఒడి, ప్రేమ పంచిఇచ్చే తల్లిపై సురమౌళికి ఎందుకంత కోపం? ఆమె పంచే ప్రేమలోన, పెంచే తీరులోన ఎక్కడ లోపం? ఆద్యంతం ఆసక్తిగా చదివించే కథ ‘తెర తొలిగింది’.
‘ఎప్పటికీ మీకేమి కాను’
ఆ ఉత్తరాన్ని విప్పకుండా టీపాయ్ మీద వుంచి కాసేపు తదేకంగా చూస్తూండిపోయింది… శేఖర్ వ్రాసిన వుత్తరం అది… శేఖర్ ఏం రాశారో?… రమ్మని రాశారా?.. ఇన్నాళ్ళ తన మనోవేదన, ఎడబాటులోని బాధా -అవన్నీ రాశారా?… ‘మన జీవితాల్లో మళ్ళీ మల్లెలువిరుస్తా’ యన్నారా?… ఇంకా ఎన్నో రకాలుగా తలబోసుకుంటూ – ఆనందంతో – వణుకుతున్న చేత్తో కవరు చించి, అందులోన్ని ఉత్తరాన్ని తీసి చదవసాగింది నీరజ… ఎన్నో నెలల తర్వాత శేఖరం నుంచి మళ్లీ ఉత్తరం అందుకున్నందుకు ఆనందమో – ఆవేదనో తెలియదు కానీ, ఆమె కళ్ళకు సన్నని నీటిపొర అడ్డువచ్చి, అక్షరాలన్నీ అలుక్కుపోతున్నాయి…
విధి ఆడుకుంటున్న మనుషుల ఆశలు తీరేనా… వేదనలూ ఆవేదనలే జీవితమా? తెలియాలంటే చదవండి ఎప్పటికీ మీకేమీకాను!